రంగారెడ్డి జిల్లా, మహానది న్యూస్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పంజాగూడలోని A.T.C ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం పంజాగూడలో నూతనంగా నిర్మాణం చేయబడిన A.T.C బిల్డింగ్ ను భవనంలోని గదులను, మిషనరీ ఏర్పాటు చేసే హాల్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడున్న ఇంచార్జ్ ప్రిన్సిపల్ వి.లక్ష్మణ్ ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులకు A.T.C అందుబాటులో ఉండే విధంగా మిషనరీ, ఇతర పనులు పూర్తి చేసేటట్లు చూడాలని కలెక్టర్ ప్రిన్సిపల్ కు సూచించారు. A.T.C బిల్డింగ్ పనులు 95 శాతం పూర్తయినాయని ఇంకా మిషనరీ రావాల్సి ఉందని ప్రిన్సిపల్ కలెక్టర్ కు వివరించారు. జిల్లా కలెక్టర్ వెంట కందుకూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మార్వో గోపాల్, A.T.C సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కందుకూర్ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో మండల/జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరిశీలించి అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారులకు, సహాయ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.
