సేంద్రియ ఉత్పత్తుల భవిష్యత్తు డిమాండ్ పెరుగుతుంది – చరిత యూనిట్ సందర్శనలో కలెక్టర్ సూచనలు

పాల్వంచ మండలం కొత్తూరు గ్రామంలోని చరిత సేంద్రియ కౌజు పిట్టల పెంపక యూనిట్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించి, యూనిట్‌లో కొనసాగుతున్న సేంద్రియ విధానాలపై సమగ్రంగా పరిశీలించారు. సేంద్రియ ఉత్పత్తులకు రాబోయే రోజుల్లో విస్తృత స్థాయిలో డిమాండ్ ఉంటుందని స్పష్టంగా తెలిపారు.

యూనిట్‌లో మునగాకు ఉత్పత్తులు, చిరుధాన్యాలతో తయారయ్యే ఆహార పదార్థాలు, ఇప్ప లడ్డు, ఇప్ప నూనె, నిమ్మ టీ, కారం పొడి, పచ్చళ్ళు, హెర్బల్ సబ్బులు వంటి మొత్తం 102 రకాల ఉత్పత్తులు రసాయన రహిత పద్ధతుల్లో తయారవుతున్నాయి. సోలార్ సిస్టమ్ ద్వారా ఎండబెట్టే విధానం, పరిశుభ్రత ప్రమాణాలు, ప్యాకేజింగ్, మార్కెటింగ్ చర్యలు ప్రత్యేకతగా నిలుస్తున్నాయని పరిశీలనలో వెల్లడైంది.

కౌజు పిట్టల గుడ్లు, మాంసం సేంద్రియ విధానాల్లో ఉత్పత్తి కావడం, స్థానిక మార్కెట్‌లో మంచి ఆదరణ పొందడం యూనిట్ ప్రత్యేకతగా కనిపించింది. పక్షుల కోసం స్థానిక వనరులతో దానాన్ని సిద్ధం చేసే ప్రక్రియ, గాలి ప్రసరణ, షెడ్ వ్యవస్థ, పరిశుభ్రత చర్యలను కూడా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన కారణంగా సేంద్రియ ఉత్పత్తుల వినియోగం భవిష్యత్తులో మరింత పెరగనుందని సూచించారు. కౌజు పిట్టలకు అవసరమైన దానాన్ని మొక్కజొన్న పిండి, పల్లి చెక్క వంటి స్థానిక వనరులతో తయారు చేస్తే రైతులకు ఖర్చులు తగ్గడమే కాకుండా, ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

జిల్లా వ్యాప్తంగా కౌజు పిట్టల పెంపకంపై ఆసక్తి పెరుగుతోందని, చరిత యూనిట్ వంటి కేంద్రాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే యూనిట్ భవిష్యత్తులో ఇతర గ్రామాలకు కూడా దానాన్ని సరఫరా చేసే విధానాన్ని అందించేందుకు అవకాశాలు పరిశీలించాల్సిందిగా సూచించారు.

పరిశీలన కార్యక్రమంలో చరిత ఆర్గానిక్ యూనిట్ చైర్మన్ జయ, డాక్టర్ సోమరాజు దొర, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *